ప్రముఖ మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్.. గతేడాది నవంబరు నెలలో 17.5 లక్షలపైగా ఖాతాలను బ్యాన్ చేసింది. ఈ వివరాలను సదరు కంపెనీ వెల్లడించింది. గతేడాది భారత్లో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబందనల ప్రకారం, 50 లక్షల కన్నా ఎక్కువ మంది యూజర్లు ఉన్న డిజిటల్ వేదికలు ప్రతి నెలా కంప్లియన్స్ రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ నిబంధనల ప్రకారమే, తమ కంపెనీకి చెందిన సోషల్ మీడియా వేదికల వివరాలను సంబంధించిన వివరాలను మెటా వెల్లడించింది. నవంబరు నెలలో మొత్తం 17,59,000 వాట్సాప్ ఖాతాలను తాము బ్యాన్ చేసినట్లు ఈ కంపెనీ తెలిపింది. అలాగే మొత్తం 602 గ్రీవెన్స్ ఫిర్యాదులు అందగా.. 32 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పింది.
గత అక్టోబరు నెలలో వాట్సాప్ మొత్తంగా 20 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. నవంబరులో ఈ ఖాతాల సంఖ్యలో కొంత తగ్గుదల కనిపించింది. ఇదే సమయంలో ఫేస్బుక్లో 16.2 మిలియన్లు అంటే 1.6 కోట్లపైగా పోస్టులపై చర్యలు తీసుకున్నామని మెటా కంపెనీ తెలియజేసింది. అలాగే ఇన్స్టాగ్రామ్లో 32 లక్షల పోస్టులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.