గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో న్యాయ యాత్రలో (Bharat Jodo Nyay Yatra) భాగంగా ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నగావ్ జిల్లాలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన సాధువు శ్రీమంత శంకరదేవ (Saint Srimanta Sankardeva) జన్మస్థలమైన బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించి యాత్రను ప్రారంభించాలనుకున్నారు. అయితే ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు తనను అడ్డుకున్నారని రాహుల్ ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తనను అడ్డుకోవడానికి గల కారణమేంటని సిబ్బందిని ప్రశ్నించారు. కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గుడిలోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణయిస్తున్నారని విమర్శలు చేశారు. మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నాం. ఇక్కడకు రాకూడనంత నేరం ఏంచేశాను..? మేం ఇక్కడకు వచ్చింది ప్రార్థించడానికి.. సమస్యలు సృష్టించడానికి కాదన్నారు.
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీని మినహా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని ఎవరినీ అధికారులు ఆలయానికి అనుమతించలేదు. ఆలయం ఉన్న ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైబోరాగావ్ వద్దే రాహుల్తోపాటు నాయకులందరిని అడుకున్నారు. దీనిపై పార్టీ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ.. అక్కడికి వెళ్లాలని రాహుల్ గాంధీ అనుకున్నారు. అనుమతి కోసం మా ఎమ్మెల్యే జనవరి 11 నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఆలయానికి వస్తామని చెప్పామని, దానికి ఆలయ అధికారులు అనుమతించారని చెప్పారు. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి రాకూడదని ఆదివారం సాయంత్రం తమకు సమాచారం అందిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడివల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. కాగా, రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రం అస్సాంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ. మేర జనవరి 25 వరకు కొనసాగనుంది.