అనంత్నాగ్: జమ్మూకశ్మీర్లో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో.. ముగ్గురు ఆర్మీ ఆఫీసర్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కాల్పులకు పాల్పడింది ద రెసిస్టెన్స్ ఫ్రంట్(The Resistance Front). దీన్నే టీఆర్ఎప్ అంటున్నారు. ఆ ఉగ్ర సంస్థ ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, దాని లక్ష్యం ఏంటో తెలుసుకుందాం. టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. ఆన్లైన్ సంస్థగా ఇది పుట్టుకొచ్చింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇది ఆవిర్భవించింది. కశ్మీర్కు 2019 ఆగస్టులో ప్రత్యేక హోదా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ జన్మించింది.
కొన్ని మీడియా కథనాల ప్రకారం.. పాకిస్థాన్లోని కరాచీ కేంద్రంగా టీఆర్ఎఫ్ పనిచేస్తోంది. అయితే లష్కరే తోయిబా, తెహ్రీక్ ఈ మిలిటెంట్ ఇస్లామియా, ఘజ్నవి హింద్ సంస్థల కలయికే టీఆర్ఎఫ్. అయితే ఆ సంస్థకు ఎటువంటి మతపరమైన ఉద్దేశాన్ని కట్టబెట్టవద్దు అన్న ఆలోచనతో దానికి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ప్రజా ఉద్యమంగా చూపించాలన్న ఉద్దేశంతో ఆ పేరును ఫిక్స్ చేశారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిఘా నుంచి దూరంగా ఉండేందుకు కూడా ఈ ఎత్తు వేసినట్లు తెలుస్తోంది.
లష్కరేతోయిబా, జైషే మహమ్మద్ సంస్థలకు మతపరమైన కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఆ లింకలను పాకిస్థాన్ ఇష్టపడడం లేదు. కానీ కశ్మీర్లో తీవ్రవాదం స్థానికత అంశంగా చిత్రీకరించాలన్న ఉద్దేశంతో ఈ పేరు పెట్టినట్లు భావిస్తున్నారు. పాకిస్తాన్లో ఉగ్ర కలాపాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. పారిస్కు చెందిన ఎఫ్ఏటీఎఫ్ ఆ దేశంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థలకు ఫైనాన్సింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు కొత్త పేర్లతో ఎత్తులు వేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
2020 జనవరి నుంచి కశ్మీర్లో జరుగుతున్న దాడులకు తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ చెబుతోంది. సాజిద్ జాట్, సజ్జద్ గుల్, సలీమ్ రెహ్మని లాంటి వారు దీంట్లో నేతలుగా ఉన్నారు. వీళ్లంతా ఒకప్పుడు లష్కరే తీవ్రవాదులు. లష్కరేతో పాటు ఇతర ఉగ్ర గూపుల నుంచి దృష్టి మళ్లించేందుకు తాజా దాడుల్ని తాము చేస్తున్నట్లు టీఆర్ఎఫ్ చెప్పుకుంటోందని వాదనలు వినిపిస్తున్నాయి.
మరో వైపు టీఆర్ఎఫ్పై ఇండియా బ్యాన్ విధించింది. హఫీజ్కు చెందిన లష్కరేకు అది ప్రాక్సీ అని ఇండియా పేర్కొన్నది. ఆన్లైన్ ద్వారా యువతను టీఆర్ఎఫ్ రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ఆరోపించింది. పాక్ నుంచి ఆయుధాలు, నార్కోటిక్స్ సరఫరా కోసం ఆ యువతను వాడుకుంటున్నారు. ఉగ్రవాద సంస్థల వైపు జమ్మూకశ్మీర్ ప్రజల్ని ఆకర్షించేందుకు .. సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎఫ్ సైకలాజికల్ ఆపరేషన్స్ చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సజ్జద్ గుల్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
కశ్మీర్లో ఉగ్రదాడులతో పాటు కశ్మీరీ పండిట్ల హత్య కేసుల్లో టీఆర్ఎఫ్ హస్తం ఉంది. టీఆర్ఎఫ్ ఇప్పుడు యాక్టివ్ గ్రూపుగా మారినట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది కశ్మీర్లో 172 మంది ఉగ్రవాదుల్ని హతమార్చారు. దాంట్లో 108 మంది టీఆర్ఎఫ్కు చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో 35 మందికి జేషే గ్రూపుతో లింకు ఉంది. మిలిటెంట్ సంస్థలు గత ఏడాది 100 మందిని రిక్రూట్ చేస్తే, దాంట్లో 74 మంది టీఆర్ఎఫ్లో చేరినట్లు తెలుస్తోంది. పీవోకేలో లష్కరే కమాండర్ రియాజ్ అహ్మద్ ను హతమార్చారు. దానికి బదులుగా అనంత్నాగ్ ఊచకోత చేపట్టినట్లు టీఆర్ఎఫ్ పేర్కొన్నది.