IRRADIATION | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటాలు కొనాలంటేనే సామాన్యుడు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. కొన్ని సందర్భరాల్లో ఉల్లిపాయలు విషయంలోనూ ఇదే జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉల్లిపాయల కొరతను నియంత్రించడంలో భాగంగా, అవి ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు ‘ఇర్రేడియేషన్’ టెక్నాలజీ వాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గోడౌన్లకు తరలించే ముందు వాటిని ‘ఇర్రేడియేట్’ చేస్తారు. బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ ఇందుకు సహకారం అందించనుంది.
ఏదైనా వస్తువును లేదా పదార్థాన్ని రేడియేషన్కు గురిచేయడాన్ని ఇర్రేడియేషన్ అంటారు. ఇందుకు గామా లేదా ఎక్స్రే లేదా ఎలక్ట్రాన్ బీమ్ను ఉపయోగిస్తారు. ఉల్లిపాయల నిల్వకు గామా ఇర్రేడియేషన్ టెక్నాలజీ వాడుతారు. దీని ద్వారా ఉల్లిగడ్డలు మొలకలు రాకుండా, పురుగులు పట్టకుండా నిరోధించి ఎక్కువ కాలం మన్నేలా చేస్తారు. అమెరికాలోని మిస్సౌరీ యూనివర్సిటీకి చెందిన లెవిస్ స్టాడ్లర్ ‘ఫుడ్ ఇర్రేడియేషన్’కు ఆధ్యుడు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన పలు పరీక్షల్లో ఈ విధానం సురక్షితమేనని తేలింది. ఉత్పత్తులు ఎక్కువకాలం మన్నిక రావడంతోపాటు, ఆహార సబంధిత రోగాల బారిన పడకుండా ఇది కాపాడుతుందని పరిశోధకులు తెలిపారు.