(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): సామాజిక భద్రత కింద నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లలో వాటా పెంచకుండా కేంద్రం చట్టాలను ఉల్లంఘిస్తున్నదని ఆర్థిక వేత్తలు తప్పుపట్టారు. గత 16 ఏండ్ల (2006) నుంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లలో కేంద్రం వాటా పెంచలేదని పెదవి విరిచారు. ప్రముఖ ఆర్థిక వేత్తలు జీస్ డ్రేజ్, అభిజీత్ సింగ్, దేశ్ పాండే తదితర 51 మంది ఈ మేరకు మోదీ సర్కారుకు లేఖ రాశారు. ఇదే విషయాన్ని తాము 2015, 2017లో అప్పటి ఆర్థిక మంత్రి జైట్లీ దృష్టికి తీసుకొచ్చినా పెడచెవిన పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్లోనైనా పింఛన్లు, ఆహార భద్రతా చట్టం-2013 క్రింద ప్రసూతి ప్రయోజనాల కింద ఇచ్చే నిధులను పెంచాలని కోరారు. ఈ చట్టం కింద ఇచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60:40 నిష్పత్తిలో ఉండాలని కోరినా కేంద్రం నిధులు కేటాయించటం లేదని, ఇది అన్యాయమంటూ కేంద్రం వైఖరిని దుయ్యబట్టారు.
16 ఏండ్లుగా పెంపులేదు
సామాజిక భద్రత కింద వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లలో కేంద్రం తన వాటాను 2006 నుంచి పెంచలేదని ఆర్థిక వేత్తలు గుర్తు చేశారు. కేంద్రం తన వంతుగా కేవలం వృద్ధులకు రూ.200, వితంతువులకు రూ.300 చెల్లిస్తున్నదని, దీన్ని రూ.500కు పైగా పెంచాలని కోరారు. అందుకయ్యే నిధులను బడ్జెట్లో కేటాయించాలని విన్నవించారు.
అర్హులందరికీ తెలంగాణ ‘ఆసరా’
పింఛన్ల వాటాను కేంద్రం 16 ఏండ్లుగా పెంచకపోయినా, తెలంగాణ సర్కారు.. ఆసరా కింద వృద్ధులు, వితంతువులకు రూ.2,016 అందిస్తున్నది. దివ్యాంగులకు రూ.3,016 చెల్లిస్తున్నది. ఇవికాక చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు రోగులు, ఎయిడ్స్ రోగులకు నెలనెలా రూ.2,016 పెన్షన్ ఇస్తున్నది. కేసీఆర్ కిట్ పథకం కింద ప్రభుత్వ దవాఖానల్లో జరిగే ప్రసవాలకు రూ.12 వేలు చెల్లిస్తున్నది.
ప్రతి కాన్పునకు రూ.6000 చెల్లించాలి
జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 ప్రకారం.. చట్టబద్ధంగా ప్రతి కాన్పునకు ఒక్కో బిడ్డకు రూ.6000 ప్రసూతి ప్రయోజనం కల్పించాలని ఆర్థిక నిపుణులు గుర్తుచేశారు. కేంద్రం తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘిస్తున్నదని విమర్శించారు. దీని అమలుకు 2017లో ప్రధానమంత్రి మాతృవందన యోజనను తీసుకొచ్చినా, బడ్జెట్లో రూ.2,500 కోట్లకు మించి నిధులు కేటాయించలేదని తెలిపారు. రూ.5,000.. అదీ ఒకే బిడ్డకు పరిమితం చేయటం చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని తప్పుపట్టారు.