Budget 2024 | కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించారు. బడ్జెట్లో ఇతర రంగాలకు మాదిరిగానే వ్యవసాయంపై కీలక ప్రకటనలు చేశారు. బడ్జెట్లో వ్యవసాయ, రైతు సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. రైతులే మన ‘అన్నదాతలు’ అని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. పీఎం-కిసాన్ సమ్మాన్ యోజన కింద, సన్నకారు, చిన్న రైతులతో సహా 11.8 కోట్ల మంది రైతులకు ప్రతి సంవత్సరం ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా కల్పించినట్లు తెలిపారు. యావత్ దేశంతో పాటు ప్రపంచానికి ఆహారాన్ని అందించేందుకు ‘అన్నదాతలు’ సహాయం చేస్తున్నారన్నారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ 1,361 మండీలను ఏకీకృతం చేసి రూ.3లక్షల కోట్ల విలువైన టర్నోవర్ను నిర్వహిస్తోందన్నారు. వ్యవసాయ రంగం సమ్మిళిత, సమతుల్య, అధిక వృద్ధి, ఉత్పాదకత వైపు పయనిస్తోందని తెలిపారు. రైతు కేంద్రీకృత విధానాలను తీసుకురావడం, రైతులకు ఆదాయ ఉత్పత్తిలో మద్దతు ఇవ్వడం, ధర, బీమా ద్వారా రిస్క్ కవరేజీని అందించడం, స్టార్టప్ల ద్వారా సాంకేతికత, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
బడ్జెట్లో కీలక విషయాల్లో కోత అనంతరం కార్యకలాపాల్లో ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంలో పెట్టుబడులు ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. నానో-డీఏపీ వినియోగం అన్ని ఆగ్రో క్లైమెటిక్ జోన్స్కు విస్తరించన్నట్లు పేర్కొన్నారు. నూనెగింజల విషయంలో స్వావలంభన సాధించేందుకు ‘ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్’ కార్యక్రమాన్ని తెలిపారు. డెయిరీ అభివృద్ధికి సమగ్ర కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆక్వాకల్చర్ ఉత్పాదకతను పెంచేందుకు, రెట్టింపు ఎగుమతులు, మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. దేశవ్యాప్తంగా ఐదు ఆక్వా పార్క్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.