మీరట్, జూన్ 27: వ్యవసాయ బోర్లకు మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ రైతులు సమరశంఖం పూరించారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో సోమవారం మీరట్లోని పశ్చిమాంచల్ విద్యుత్తు పంపిణీ సంస్థ కార్యాలయం (ఊర్జా భవన్) వద్ద ‘మహా పంచాయత్’ పేరిట మహా ధర్నా చేపట్టారు. బీకేయూ జాతీయ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్, యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు గౌరవ్ టికాయిత్ ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు మీటర్ల బిగింపునకు సంబంధించి రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ వ్యతిరేకించగా, పలు బీజేపీ పాలిత రాష్ర్టాలు మీటర్ల బిగింపునకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సాగునీటి బోర్లకు మీటర్ల బిగింపు ప్రక్రియను చేపట్టింది.
భవిష్యత్తులో తమపై భారం మోపేందుకే విద్యుత్తు మీటర్లు బిగిస్తున్నారని గ్రహించిన రైతాంగం.. పలుచోట్ల ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నది. ఇప్పటికే మీరట్ డివిజన్లో బిగించిన మీటర్లను ఊడబీకిన రైతులు వాటిని విద్యుత్తు కార్యాలయాల్లో కుప్పగా వేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మీరట్లో విద్యుత్తు కార్యాలయం వద్ద మహాధర్నాకు బీకేయూ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మీరట్ డివిజన్లోని పలు గ్రామాల నుంచి వందలాది మంది రైతులు ట్రాక్టర్లలో ఉదయమే అక్కడికి చేరుకున్నారు. తొలగించిన విద్యుత్తు మీటర్లను వారు వెంట తీసుకువచ్చారు. ధర్నా సందర్భంగా రోడ్డు పైనే వంటావార్పు నిర్వహించారు. తమ పోరాటం కొనసాగుతుందని, మీరట్ విద్యుత్తు కార్యాలయం వద్ద ఈ నెల 30 వరకు వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేస్తామని బీకేయూ మీరట్ శాఖ అధ్యక్షుడు గుడ్డూ ప్రధాన్, రైతు నేతలు రాజ్కుమార్ కర్ణావల్, బబ్లూ జిటౌలి తదితరులు స్పష్టంచేశారు.
వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామాలు: నరేశ్ టికాయత్
వ్యవసాయ బోర్లపై విద్యుత్తు మీటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదని నరేశ్ టికాయిత్ స్పష్టంచేశారు. ప్రభుత్వం ఏ రూపంలో దీన్ని అమలు చేయాలని చూసినా, రైతుల నుంచి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులకు యూపీ ప్రభుత్వం సక్రమంగా విద్యుత్తును పంపిణీ చేయడం లేదని.. ఇస్తున్న అరకొర విద్యుత్తుకు మీటర్లు బిగించడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మీటర్లను అధికారులు వెంటనే తొలగించాలని, లేని పక్షంలో రైతులే స్వయంగా మీటర్లను తొలగించి.. పశ్చిమాంచల్ విద్యుత్తు పంపిణీ సంస్థ (పీవీవీఎన్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ మల్లప్ప బంగారి కార్యాలయాన్ని వాటితో నింపేస్తారని నరేశ్ టికాయిత్ హెచ్చరించారు.
అనంతరం అధికారులకు రైతు ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. కాగా, ఆదివారం కిసాన్ మజ్దూర్ సంఘటన్ నేతలతో విద్యుత్తు అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గంటపాటు జరిగిన ఈ చర్చల్లో అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు. విద్యుత్తు మీటర్ల తొలగింపు నిర్ణయం తమ చేతుల్లో లేదని పీవీవీఎన్ఎల్ ఎండీ అరవింద్ మల్లప్ప బంగారి రైతు నాయకులకు స్పష్టంచేశారు. సోమవారం బీకేయూ ఆధ్వర్యంలో రైతులు మహాధర్నాకు దిగగా, అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని నేతలు స్పష్టంచేశారు.