West Bengal : పశ్చిమ బెంగాల్లో సిరిగురి పట్టణంలోని ఒక మురికివాడలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి 8 గంటలకు రానా బస్తీలో ఒక్కసారిగా భారీ ఎత్తులో మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు రంగంలోకి దిగారు. 8 అగ్నిమాపక వాహనాలతో మంటల్ని ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. 50 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 12 మందిలో తీవ్ర గాయాలైన అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు పిల్లలకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగతా 9 మందికి ప్రాథమిక చికిత్స చేశారు.
ఈ ప్రమాదంలో ఇళ్లు, వంట సామాగ్రి, నిత్యావసరాలు అగ్నికి ఆహూతి అయ్యాయి. దాంతో, అధికారులు అక్కడివాళ్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వసతి కేంద్రాలకు తరలించారు. వాళ్లకు ఆహారం, దుస్తులు అందిస్తున్నారు. ‘అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటనేది తెలియలేదు. చాలా ఇళ్లలో సిలిండర్లు పేలిపోయాయి. దాంతో మంటలు వేగంగా బస్తీ అంతా వ్యాపించాయి. ఈ బస్తీలో దాదాపు 2 వేల మంది నివసిస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడానికి కారణం ఏంటనేది త్వరలోనే వెల్లడిస్తాం’ అని పోలీస్ కమిషనర్ అఖిలేష్ చతుర్వేది చెప్పారు.