కోల్కతా: రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు ఆ రాష్ట్ర కాలేజీల్లో అడ్మిషన్ల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సీఎం మమతా బెనర్జీ దీనికి సంబంధించిన ఒక ప్రణాళికను గురువారం ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన మమత, మరో దేశంలో వైద్య విద్యకు భారీగా ఖర్చు చేసే పరిస్థితిలో ఆ విద్యార్థులు లేరని అన్నారు. విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చి రెండు నెలలైనా కేంద్ర ప్రభుత్వం ఏ బాధ్యత తీసుకోలేదని విమర్శించారు. చదువు కోసం పోలాండ్, హంగేరీ వెళ్లాలని మాత్రమే వారికి చెబుతున్నారని ఆరోపించారు. అయితే మరోసారి విద్యకు భారీగా ఖర్చే చేసే పరిస్థితిలో ఆ విద్యార్థులు లేరన్నారు.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన రాష్ట్ర విద్యార్థుల కోసం ఒక ప్రణాళికను రూపొందించినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య కార్యదర్శి దీనిపై కసరత్తు చేసినట్లు చెప్పారు. ఉక్రెయిన్ నుంచి బెంగాల్కు చెందిన 422 మంది తిరిగి వచ్చారని అన్నారు. ఇందులో 412 మంది వైద్య విద్యార్థులని తెలిపారు. 408 మంది ఎంబీబీఎస్, ముగ్గురు డెంటల్ స్టూడెంట్స్ అని వివరించారు. మిగతా పది మందిలో ఆరుగురు ఇంజినీరింగ్, ఒకరు వెటర్నరీ విద్యార్థులు కాగా ముగ్గురు కార్మికులని వెల్లడించారు.
విద్యార్థులు మార్చి 16న అధికారులతో సమావేశమై వారి వివరాలు, సీవీలను అందజేశారని సీఎం మమత తెలిపారు. వారి అడ్మిషన్ల కోసం సంబంధిత శాఖలకు వాటిని పంపినట్లు చెప్పారు. ఆరో ఏడాది వైద్య విద్యనభ్యసించే 23 మంది విద్యార్థులను సంబధిత నిబంధనల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇంటర్న్పిప్కు అనుమతిస్తామని తెలిపారు. 43 మంది ఐదో ఏడాది, 92 మంది నాలుగో ఏడాది వైద్య విద్య విద్యార్థులకు పలు వైద్య కాలేజీల్లో డిస్ట్రిబ్యూషన్ పద్ధతిలో కాలేజీకి 15-20 మంది చొప్పున సీట్లు కేటాయిస్తామని అన్నారు.
అలాగే 93 మంది మూడో ఏడాది, 79 మంది రెండో ఏడాది వైద్య విద్యార్థులకు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ప్రాక్టికల్ క్లాసులు నిర్వహిస్తామని సీఎం మమత తెలిపారు. తొలి, రెండో ఏడాదికి చెందిన 78 మందిలో నీట్కు అర్హత పొందిన 69 మంది విద్యార్థులను కౌన్సిలింగ్కు పిలుస్తామని చెప్పారు. ప్రైవేట్ వైద్య కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద వెంటనే అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. ఈ విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇవ్వాలని ప్రైవేట్ వైద్య కాలేజీలను కోరినట్లు మమత వెల్లడించారు. ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రైవేట్ కాలేజీల్లో, డెంటల్ కోర్సు పూర్తి చేసిన ఒకరిని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఇంటర్న్షిప్కు మిగా ఇద్దరికి ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతించినట్లు వివరించారు.