న్యూఢిల్లీ : మూడు రాష్ర్టాల్లో ఓటమికి కారణం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)లేనని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఆ పార్టీ నేత ఉదిత్ రాజ్ ఆదివారం చేసిన ఓ ట్వీట్లో ‘ఈవీఎంల వల్ల ఏదో జరిగి ఉంటుంది, లేదంటే ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు’ అని చెప్పారు. ‘నేటి ఎన్నికల ఫలితాల తర్వాత, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనుగడ సాగించడం కష్టమేననిపిస్తున్నది“ అని ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. బీజేపీ విజయం సాధించింది. మిజోరం శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరుగుతుంది.