న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై తాము చేపట్టిన సైనిక చర్యపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో భారత్ మద్దతును ఆశిస్తున్నామని రష్యా తెలిపింది. ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితికి దారితీసిన కారణాలపై భారత్కు లోతైన అవగాహన ఉందని పేర్కొంది. రెండు దేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా భారత్ నిరంతర మద్దతును రష్యా కోరుతున్నదని భారత్లోని రష్యా సీనియర్ దౌత్యాధికారి రోమన్ బాబుష్కిన్ తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితి, దానికి దారితీసిన కారణాలపై భారతదేశానికి ఉన్న లోతైన అవగాహనకు మేం ఎంతో అభినందిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాకు భారతదేశం మద్దతు ఇస్తుందని మేం ఆశిస్తున్నాము’ అని శుక్రవారం పీటీఐ వార్తా సంస్థతో అన్నారు. ఉక్రెయిన్పై భారత్ తటస్థ వైఖరిని ఆయన అభినందించారు. ఉక్రెయిన్కు సంబంధించి తాజా పరిణామాలపై భారత్తో అన్ని సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు.
కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం సాయంత్రం సమావేశమవుతున్నది. ఉక్రెయిన్పై రష్యా దాడికి సంబంధించిన తీర్మానంపై చర్చించనున్నది. పశ్చిమ, ఐరోపా దేశాలు ఉక్రెయిన్పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించాయి. రష్యాపై చర్యలు, ఆంక్షల కోసం ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో ఐరాస భద్రతా మండలిలో శుక్రవారం సాయంత్రం ఈ తీర్మానంపై జరిగే ఓటింగ్కు భారత్ మద్దతును రష్యా కోరింది.