బెంగుళూరు : అనుకున్నట్లే చంద్రయాన్-3 ప్రాజెక్టు సూపర్ సక్సెస్ అయ్యింది. విక్రమ్ ల్యాండర్ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగింది. ఇక రోవర్ ప్రజ్ఞాన్ కూడా తన పని మొదలుపెట్టేసింది. ఇండియాను సూపర్ పవర్ దేశంగా మార్చేసిన చంద్రయాన్-3 ప్రాజెక్టు గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఎందుకు విక్రమ్ ల్యాండర్ను దించాల్సి వచ్చిందో ఆయన తన మాటల్లో చెప్పారు.
చంద్రుడిపై దక్షిణ ధ్రువానికి చాలా దగ్గరగా వెళ్లామని, దాదాపు అది 70 డిగ్రీలు వద్ద ఉన్నట్లు చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువంతో ప్రత్యేక అడ్వాంటేజ్ ఉందన్నారు. సూర్య రశ్మి ఎక్కువగా తాకని కారణంగా ఆ అడ్వాంటేజ్ వేరుగా ఉంటుందన్నారు. ఇక్కడ ఎక్కువ శాతం సైంటిఫిక్ కాంటెంట్ దొరికే ఛాన్సు ఉందన్నారు. మూన్ మిషన్పై పనిచేస్తున్న చాలా మంది శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంపైనే ఆసక్తిగా ఉన్నట్లు ఇస్రో చీఫ్ తెలిపారు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనుషులు ఆ ప్రాంతానికి వెళ్లాలని, అక్కడ కాలనీలను ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత తిరుగు ప్రయాణం చేయాలన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. మనం ఎదురుచూస్తున్న బెస్ట్ ప్లేస్ అదే అని ఆయన చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో కాలనీలు ఏర్పాటు చేసేందుకు.. అక్కడ ఆ సామర్థ్యం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
#WATCH | ISRO chief S Somanath on why ISRO chose the South Pole of the moon for Chandrayaan-3's landing; says, "We have gone closer to the South Pole which is 70 degrees almost. The South Pole has a specific advantage with respect to being less illuminated by the sun. There is a… pic.twitter.com/hpEV2MMcav
— ANI (@ANI) August 24, 2023
ప్రజ్ఞాన్ రోవర్లో రెండు పరికరాలు ఉన్నాయని, ఆ పరికరాలు చంద్రుడి ఉపరితలంలో ఉన్న మూలకాల కూర్పును పరిశీలిస్తాయని ఇస్రో చీఫ్ తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై ఆ రోవర్ కదులాడుతుందన్నారు. రోబోటిక్ పాత్ ప్లానింగ్ విన్యాసం కూడా ఆ రోవర్ చేస్తుందని, ఇది భవిష్యత్తు అన్వేషణలకు ఉపయోగపడుతుందని ఇస్రో చీఫ్ వెల్లడించారు.
సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య మిషన్ చేపడుతున్నామని, సెప్టెంబర్లో ఆ ప్రయోగం జరిగే అవకాశం ఉందని సోమనాథ్ తెలిపారు. గగన్యాన్ కూడా ఇంకా వర్కింగ్ పనిలో ఉందన్నారు. అయితే గగన్యాన్కు చెందిన క్రూ మాడ్యూల్ను పరీక్షించేందుకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఓ మిషన్ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 2025లో మానవుల్ని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానికన్నా ముందు అనేక టెస్టులు నిర్వహించాల్సి ఉంటుందని ఇస్రో చీఫ్ చెప్పారు.