చండీగఢ్: హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అందరినీ తాము రక్షించలేమని అన్నారు. అలాగే శాంతి, భద్రతలకు పోలీసులు లేదా ఆర్మీ గ్యారెంటీ ఇవ్వలేరని తెలిపారు. ఆస్తులు నష్టపోయిన బాధితులకు పరహారాన్ని అల్లర్లకు పాల్పడినవారే చెల్లిస్తారని చెప్పారు. హర్యానాలోని నూహ్ జిల్లాలో గత రెండు రోజులుగా జరిగిన ఘర్షణల్లో ( Haryana Violence) ఇద్దరు పోలీస్ అధికారులతో సహా ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు, షాపులు, ఇండ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ అల్లర్లకు సంబంధించి 116 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 190 మందిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ మీడియాతో బుధవారం మాట్లాడారు. నూహ్ జిల్లాలో ప్లాన్ ప్రకారమే హింస జరిగిందని తెలిపారు. ప్రజలు శాంతియుతంగా, సామరస్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే పోలీసులు లేదా ఆర్మీ కూడా దీనికి గ్యారెంటీ ఇవ్వలేరని అన్నారు. అలాగే ప్రతిఒక్కరినీ తాము రక్షించలేమని సీఎం ఖట్టర్ వ్యాఖ్యానించారు. రెండు రోజులపాటు జరిగిన హింసలో ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురు మరణించినట్లు తెలిపారు. బాధిత పోలీస్ కుటుంబాలకు రూ.57 లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు చెప్పారు.
మరోవైపు వాహనాలు, ఆస్తులకు వాటిల్లిన నష్ట పరిహారం, అల్లర్లకు పాల్పడిన వారి నుంచే బాధితులకు లభిస్తుందని సీఎం మనోహర్లాల్ ఖట్టర్ తెలిపారు. కేవలం ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్ణ పరిహారాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. ప్రైవేట్ భవనాలు, వాహనాలకు వాటిల్లిన నష్టంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అల్లర్లకు పాల్పడిన బాధ్యుల నుంచే ఆ పరిహారాన్ని వసూలు చేస్తామని అన్నారు. అల్లర్లు చెలరేగడానికి కారణమైన మోను మనేసర్, వీహెచ్పీ యాత్రలో పాల్గొన్నాడా లేదా అన్నది సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్ ద్వారా అధికారులు దర్యాప్తు చేస్తారని వెల్లడించారు.