న్యూఢిల్లీ: పతంజలి కంపెనీ యాడ్స్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్, బాలకృష్ణ సమర్పించిన క్షమాపణలను కోర్టు తోసిపుచ్చింది. మేం గుడ్డివాళ్లం కాదు అని, ఈ కేసులో ఉదాసీనంగా ఉండలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. ఈ కేసులో కేంద్ర సర్కారు ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని సుప్రీం తెలిపింది. పేపర్ మీద క్షమాపణలు చెప్పారు, కానీ వాళ్లు వెన్ను చూపిస్తున్నారని, ఆ క్షమాపణలను తాము అంగీకరించడం లేదని, కావాలనే ఉల్లంఘించినట్లు ఉందని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఏ అమానుల్లాతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది.
రాందేవ్, బాలకృష్ణలు తమ క్షమాపణ పత్రాలను తొలుత మీడియాకు పంపారని, సమస్య కోర్టుకు వచ్చేవరకు వాళ్లు తమకు అఫిడవిట్లను పంపలేదని, నిన్న రాత్రి ఏడున్నరకు క్షమాపణ పత్రాలను మీడియాకు పంపారని, కానీ తమకు అప్లోడ్ చేయలేదని, వాళ్లు కేవలం పబ్లిసిటీని నమ్ముకున్నారని జస్టిస్ కోహ్లీ తెలిపారు. క్షమాపణ పత్రాలు రిజిస్ట్రీకి అందాయా లేదా అన్న విషయం తనకు తెలియదని పతంజలి కంపెనీ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ తెలిపారు. అఫిడవిట్ను డీఫ్రాడ్ చేస్తున్నారని, ఎవరు ఆ డ్రాఫ్ట్ను రూపొందించారని, చాలా ఆశ్చర్యకరంగా ఉందని జస్టిస్ అమానుల్లా తెలిపారు. లోపం జరిగిందని రోహత్గీ అన్న మాటలను సుప్రీం ధర్మాసనం వ్యతిరేకించింది.