చెన్నై: అనారోగ్యంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) భౌతికకాయాన్ని తమిళనాడు రాజధాని చెన్నైలోని కోయంబేడు ఏరియాలోగల (DMDK) ప్రధాన కార్యాలయానికి చేర్చారు. అభిమానులు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చామని కుటుంబసభ్యులు తెలిపారు.
కెప్టెన్ విజయకాంత్ను కడసారి చూడటం కోసం పార్టీ హెడ్ ఆఫీస్కు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. కాగా శ్వాస సంబంధిత సమస్యతో విజయకాంత్ చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
71 ఏండ్ల విజయకాంత్ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 18న కూడా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో మియోట్ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్ 11న ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత రెండు వారాలైనా గడువకముందే ఆయన కొవిడ్ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఇవాళ మృతిచెందారు.
తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విజయకాంత్.. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2011లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం డీఎండీకేకు ప్రతిపక్ష హోదా దక్కింది. విజయకాంత్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు.