Assam CM kneels 90-year-woman | అసోం సీఎం హిమంత బిశ్వశర్మకు శుక్రవారం ఒక ప్రత్యేక పిటిషనర్ తారస పడ్డారు. ఆ పిటిషనర్ 90 ఏండ్ల వృద్ధురాలు. కాజిరంగలో సీఎం హిమంత బిశ్వశర్మను కలుసుకున్నారు. తన కొడుకు సమస్యను ప్రస్తావించారు. ఆమె చెప్పిన విషయాలన్నీ ఓపిగ్గా విన్నారు. ప్రభుత్వం నుంచి ఆమెకు అవసరమైన మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు హృదయాన్ని కదిలించే ఈ ఘటనకు సంబంధించిన వీడియోనూ అసోం సీఎంవో షేర్ చేసింది. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పూర్తిగా వంగి నిలబడి ఆమెను పలకరించారు.
ఆమె చేతులు పట్టుకుని ఆ వృద్ధురాలి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. సరిగ్గా భోజనం చేస్తున్నారా.. ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. తనకు బయటి భోజనం పడదని చెప్పడంతో కొన్ని ఫండ్లు తెప్పించారు. కొంత పెండింగ్ పనుల కోసం సీఎంను కలిసినట్లు ఆ వృద్ధురాలు చెప్పారు. వెంటనే ఆమె సమస్యను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సదరు వృద్ధురాలి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. తాను వ్యక్తిగతంగా ఈ అంశాన్ని పరిశీలిస్తానని, ఇంటికెళ్లిపోవాల్సిందిగా ఆ వృద్ధురాలిని కోరారు. మళ్లీ ఎప్పుడు వచ్చినా కలుస్తానని కూడా చెప్పారు. ఆ తర్వాత వృద్ధురాలితో కలిసి ఉన్న ఫొటోలను సీఎం హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు.