న్యూఢిల్లీ: ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్పాల్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నాడని పంజాబ్ పోలీసులు ప్రకటించారు. శనివారం పోలీసులకు చిక్కినట్టే చిక్కి అతను మళ్లీ తప్పించుకున్నాడని తెలిపారు. అమృత్పాల్ను అరెస్ట్ చేసేందుకు తమ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని పంజాబ్ ఐజీపీ సుఖ్చైన్ సింగ్ ఇవాళ మీడియా సమావేశంలో వెల్లడించారు.
అమృత్పాల్ పోలీసుల అదుపులోనే ఉన్నాడంటూ తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, అలాంటిదేమీ లేదని ఐజీపీ స్పష్టంచేశారు. అమృత్పాల్ దొరకలేదని ఇప్పటికే స్పష్టంగా ప్రకటించామని, అతని కోసం గాలింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. అమృత్పాల్ నేతృత్వంలోని వారిస్ పంజాబ్ దేకు ఐఎస్ఐ (ISI)తో కూడా లింకులు ఉన్నట్లు అనుమానాలున్నాయని ఆయన చెప్పారు.
ఇప్పటివరకు అమృత్పాల్కు సంబంధించిన 114 మంది అనుచరులను అరెస్ట్ చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినందుకు వాళ్లను అదుపులోకి తీసుకున్నామని ఐజీపీ చెప్పారు. గాలింపులు ముమ్మరం చేసిన మొదటి రోజు అంటే శనివారం 78 మందిని, ఆదివారం 36 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా వారి నుంచి 10 మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉన్నదని, శాంతిభద్రతలకు వచ్చిన ముప్పేమీ లేదని ఐజీపీ సుఖ్చైన్ సింగ్ తెలిపారు.