రాంచీ: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుడైన కుమారుడి కోసం అతడి తండ్రి 16 రోజుల పాటు ఎదురుచూశాడు. (Uttarakhand Tunnel rescued Workers) అయితే మంగళవారం సాయంత్రం కుమారుడు టన్నెల్ నుంచి సురక్షితంగా బయటపడగా, ఆ ఉదయమే అతడి తండ్రి మరణించాడు. 70 ఏళ్ల ఆ వ్యక్తి గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బహదా గ్రామానికి చెందిన 29 ఏళ్ల భక్తు ముర్ము ఉత్తరకాశీలో కూలిన టన్నెల్లో చిక్కుకున్నాడు. అయితే తండ్రి 70 ఏళ్ల బాసెట్ ముర్ము 16 రోజులుగా కుమారుడి కోసం ఎదురుచూశాడు. అతడు క్షేమంగా బయటకు వస్తాడా? అన్న బెంగతో రోజులు గడిపాడు.
కాగా, నవంబర్ 12 నుంచి 17 రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రెస్క్యూ సిబ్బంది మంగళవారం సాయంత్రం కాపాడి సురక్షితంగా బయటకు తెచ్చారు. అయితే కార్మికుడు భక్తు ముర్ము తండ్రి, బాసెట్ ముర్ము దురదృష్టవశాత్తు అదే రోజు ఉదయం మరణించాడు. తన కుమారుడి క్షేమం గురించి ఆందోళన చెందిన ఆయన మంగళవారం ఉయదం 8 గంటల సమయంలో మంచం నుంచి కింద పడి గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.