Venkaiah Naidu | పార్టీ ఫిరాయింపుల చట్టంలో లొసుగులపై ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం ప్రజా ప్రతినిధులను హోల్సేల్గా కొనుగోలు చేసేందుకు మార్గం సుగమం చేసిందన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం సమర్ధవంతంగా అమలు చేయాలంటే దానికి సవరణలు తేవాల్సిన అవసరం ఉందని ఆదివారం అన్నారు. నూతన భారతంలో మీడియా పాత్ర అనే అంశంపై బెంగళూరు ప్రెస్క్లబ్లో జరిగిన చర్చాగోష్టిలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించకుండా ఆ లోపాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం హోల్సేల్ ఫిరాయింపులనే అనుమతిస్తున్నది. రిటైల్ ఫిరాయింపులను కాదు. కనుక ఆయా పార్టీల నేతలు తమకు అవసరమైన మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మరో పార్టీలోకి ఫిరాయించడానికి బదులు తమ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఒకవేళ ప్రజా ప్రతినిధులు తాము ఎన్నికైన పార్టీని వీడాలనుకుంటే ముందుగా వారు తమ పదవులకు రాజీనామా చేయాలి. అటుపై తిరిగి ఎన్నికవ్వాలి. అందుకు వీలుగా పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలు తేవాల్సి ఉందని భావిస్తున్నానని చెప్పారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద దాఖలైన పిటిషన్లపై స్పీకర్లు, చైర్పర్సన్లు, న్యాయస్థానాలు విచారణను ఏండ్ల తరబడి కొనసాగించడం పట్ల వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యులపై చర్య తీసుకునే అధికారం అసెంబ్లీ లేదా లోక్సభ స్పీకర్, రాజ్యసభ లేదా శాసనమండలి చైర్మన్లకు ఉన్నా.. అత్యధిక కేసుల్లో అదేమీ జరుగడం లేదన్నారు. కొన్ని ఫిరాయింపుల కేసులపై న్యాయస్థానాలు తీర్పు ఇచ్చే నాటికి సంబంధిత సభ్యుల పదవీ కాలం పూర్తవుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు. కోర్టులతోపాటు ప్రిసైడింగ్ అధికారి, స్పీకర్లకు పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకునేందుకు గరిష్ఠంగా ఆరు నెలల సమయం కావాలన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవచ్చునన్నారు.