మాస్కో: అణ్వాస్త్రాల్ని వాడే రిస్క్ పెరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. తామేమి అణు దాడి చేసేందుకు పిచ్చిగా లేమని, కానీ ఎవరైనా దాడి చేస్తే మాత్రం అణ్వాయుధం వాడనున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. రష్యా వార్షిక మానవ హక్కుల మండలి సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగియదన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దాడి ప్రకటించిన తర్వాత పుతిన్ అణ్వాయుధాల్ని వాడుతారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి దాడి ఏమీ జరగలేదు. అణ్వాయుధాన్ని ప్రయోగించే అవకాశాలు పెరుగుతున్నాయని, ఆ విషయాన్ని దాచిపెట్టడం తప్పే అవుతుందని పుతిన్ అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా మొదట అణ్వాయుధాన్ని వాడదని పుతిన్ స్పష్టం చేశారు. అంతేకాదు తమ వద్ద ఆయుధాలతో ఎవర్నీ బెదిరించడం లేదని కూడా ఆయన వెల్లడించారు. మరీ మేం పిచ్చిగా లేమని, అణ్వాయుధాలపై అవగాహన తమకు ఉందని పుతిన్ అన్నారు. అణ్వాయుధాల గురించి చెప్పుకుంటూ ప్రపంచాన్ని బెదిరించలేమన్నారు. రష్యా వద్ద అత్యాధునిక, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ ఇతర దేశాల్లో తమకు చెందిన ఆయుధాలు లేవని, కానీ అమెరికా మాత్రం తమ అణ్వాయుధాల్ని టర్కీలో ఉంచినట్లు పుతిన్ చెప్పారు.