న్యూఢిల్లీ: ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే విమానం ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ ఏ320 విమానం యూకే-122 మంగళవారం సాయంత్రం బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరింది. అయితే విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే రన్ వే నుంచి పార్కింగ్ బే వద్దకు తీసుకెళ్లేందుకు ఇంజిన్ 2ని పైలట్లు ఆపివేశారు. దీంతో ఒక ఇంజిన్తో ఆ విమానం కొంత దూరం వెళ్లగా ఇంజిన్ 1 విఫలమైంది. చేసేదేమీ లేక పైలట్లు ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించారు. విమానాన్ని లాక్కెళ్లే వాహనం సహాయం కోరారు. అనంతరం లాక్కెళ్లే వాహనం ద్వారా ఎయిర్పోర్ట్లోని పార్కింగ్ బే వద్దకు ఆ విమానాన్ని చేర్చారు.
కాగా, విస్తారా విమానయాన సంస్థ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఢిల్లీలో దిగిన తర్వాత, పార్కింగ్ బే వద్దకు వస్తున్న సమయంలో మా ఫ్లైట్ యూకే 122 (బ్యాంకాక్-ఢిల్లీ)కు జూలై 5న ఇంజిన్లో చిన్న విద్యుత్ సమస్య వచ్చింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, విమానాన్ని పార్కింగ్ బే వద్దకు తీసుకెళ్లేందుకు లాగే వాహనాన్ని మా సిబ్బంది ఎంచుకున్నారు’ అని ఒక ప్రకటనలో తెలిపింది.