10 నిమిషాల్లోనే ఫలితం
న్యూఢిల్లీ, మార్చి 20: మృతదేహానికి కోత పెట్టకుండా శవపరీక్ష (పోస్ట్మార్టం) చేసే అత్యాధునిక వర్చువల్ అటాప్సీ విధానం ఢిల్లీలోని ఎయిమ్స్లో శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దక్షిణాసియాలోనే ఇది తొలిసారి. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ దీనిని ప్రారంభించారు. ఈ పద్ధతిలో మృతదేహంపై కత్తిగాట్లు పెట్టాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి సుధీర్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం సాధారణపద్ధతిలో పోస్టుమార్టం జరిపేందుకు దాదాపు ఆరు గంటలు పడుతుందని, వర్చువల్ పద్ధతిలో కేవలం 10 నిమిషాల్లోనే పూర్తిచేయొచ్చని వెల్లడించారు. మృతదేహాన్ని సీటీ స్కాన్పై ఉంచినప్పుడు సెకండ్లలోనే అది 25వేల ఫొటోలు తీయగలదని, వాటి ఆధారంగా ఆ వ్యక్తి ఏ కారణంగా మరణించారన్నది నిపుణులు అధ్యయనం చేస్తారని ఎయిమ్స్ అధికారులు వివరించారు.