లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ బస్సుల దుస్థితికి ఒక వీడియో అద్దం పడుతున్నది. వర్షం కురుస్తుండగా ముందున్న అద్దాన్ని తుడిచేందుకు బస్సు డ్రైవర్ ఏకంగా ఒక వాటర్ బాటిల్ వినియోగించాడు. మీరట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ)కి చెందిన ఒక బస్సు బస్టాండ్లో నిలిచి ఉంది. ఒకవైపు వర్షం పడుతున్నది. మరోవైపు బస్సు ముందున్న అద్దం తుడిచే వైపర్ పనిచేయడం లేదు. దీంతో బస్సు డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. వైపర్కు ఒక వైపు వాటర్ బాటిల్ కట్టాడు. మరోవైపు వైర్ కట్టి తన చేతిలో లాగి బస్సు అద్దాన్ని తుడిచాడు.
కాగా, విపిన్ రాథోడ్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘జుగాడ్తో పని చేస్తున్న యూపీ ఆర్టీసీ బస్సు వైపర్’ అని శీర్షిక పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించారు. యూపీ ఆర్టీసీ బస్సుల దుస్థితిని కొందరు విమర్శించారు. వైపర్ పరిస్థితి ఇలా ఉండే ఇక బస్సుల కండీషన్ గురించి చెప్పక్కర్లేదు అంటూ కొందరు ఎద్దేవా చేశారు. యూపీ ఆర్టీసీ బస్సు దుస్థితికి అద్దం పట్టే ఈ వీడియో క్లిప్ను సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఒకరు ట్యాగ్ చేశారు.
మరోవైపు ఈ వీడియోపై మీరట్ ఆర్టీసీ డిపో స్పందించింది. ఆ బస్సు వైపర్ను బాగు చేసినట్లు చెప్పింది. వైపర్ పని చేస్తున్న వీడియోను ఈ నెల 8న ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
उत्तर प्रदेश परिवहन निगम की बस में जुगाड़ से चलता वाइपर 👇@UPSRTCHQ @UPSRTC_Meerut pic.twitter.com/IOofdiNbRE
— Vipin Rathaur (@VipinRathaur) October 9, 2022