Viral video : ‘జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి’ అంటుంటారు. అన్నట్టే అందరి నాలుకలు ఒకే రుచిని ఇష్టపడవు. అందరి మెదళ్లు ఒకేలా ఆలోచించవు. మనిషి మనిషి మధ్య అన్ని విషయాల్లో కొంత బేధాలు ఉండటం సహజం. కానీ కొందరు మాత్రం మరీ భిన్నంగా ఉంటారు. వారి ప్రవర్తన, లక్షణాలు సమాజానికి వింతగా అనిపిస్తాయి. తాజాగా అలాంటి ఓ వ్యక్తి ప్రవర్తనే ఇప్పుడు అందరినీ విస్తుపోయేలా చేసింది. ఒంటరిగా కనిపించిన ప్రతి ఒక్కరి చెంపలు వాయిస్తున్న అతడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్కు చెందిన కపిల్ కుమార్ అనే 23 ఏళ్ల యువకుడు ఇటీవలే డిగ్రీ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నాడు. అయితే గత ఐదారు నెలల నుంచి అతని ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయి. చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. రోడ్లపై ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని చెంపలు వాయిస్తున్నాడు. బాధితులకు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే తన బైకుపై అక్కడి నుంచి జారుకుంటున్నాడు.
కపిల్ కుమార్ రోడ్లపై ఒంటరిగా నడిచిపోతున్న వారిని గమనించి బైకుపై వారి దగ్గరికి వెళ్తాడు. చెంపపై ఒక్కటిచ్చి అక్కడి నుంచి తుర్రుమంటాడు. ఇలా ఇప్పటివరకు చాలా మందిని కొట్టాడు. కొంతమంది తిట్టుకుని వదిలేయగా.. కొందరు పోలీసులను ఆశ్రయించారు. అయితే గత కేసుల్లో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో నిందితుడు కనిపించిన వారి చెంపలు వాయిస్తూ మరికొన్నాళ్లు ఎంజాయ్ చేశాడు.
అయితే తాజాగా కపిల్ కుమార్.. రిటైర్డ్ పీసీఎస్ అధికారి చెంప పగులగొట్టాడు. అతను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వెనుక నుంచి వచ్చి.. ఎడమ చేతితో గట్టిగా చెంపపై కొట్టాడు. క్షణాల్లో అక్కడి నుంచి జారుకున్నాడు. బాధితుడు వృద్ధుడు కావడంతో కపిల్ కుమార్ బలంగా కొట్టిన దెబ్బకు నిలబడలేక కిందపడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#UttarPradesh: A 23-year-old unemployed graduate in #Meerut, suffering from depression after his father’s death and mother’s remarriage, was arrested for slapping pedestrians, including a woman and a retired officer, seeking dopamine rush. pic.twitter.com/biIfUxrUog
— Siraj Noorani (@sirajnoorani) December 31, 2024
కపిల్ దాడిలో స్వల్పంగా గాయపడ్డ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వృద్ధుడి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడున్న సీసీ కెమెరాను ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కపిల్ కుమార్ అని గుర్తించారు. అతడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కపిల్ అరెస్ట్ విషయం తెలుసుకున్న అతని పేరెంట్స్ హుటాహుటిన పోలీస్స్టేషన్కు వెళ్లారు. కపిల్ మానసిక పరిస్థితి గురించి పోలీసులకు వివరించారు.
కపిల్ను చిన్నప్పటి నుంచి అందరూ పిరికోడా, అదురోడా అంటూ గేళి చేసేవారని, దాంతో అతను మనుషులపై కోపం పెంచుకుని ఒంటరిగా ఉండటానికి అలవాటు పడ్డాడని అతని తల్లి చెప్పారు. కేవలం నా భర్తతో, నాతో మాత్రమే అతను మాట్లాడేవాడని ఆమె తెలిపారు. ఐదేళ్ల క్రితం తన భర్త మరణించాడని, తండ్రి మరణంతో అతను మరింత ఒంటరి అయ్యాడని వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఐదారు నెలల క్రితం తాను రెండో పెళ్లి చేసుకున్నానని, దాంతో కపిల్ డిప్రెషన్ మరింత పెరిగిందని అతని తల్లి తెలిపారు. ప్రస్తుతం తాను రెండో భర్తతో కలిసి సూరజ్ కుంద్లో ఉంటున్నానని, కపిల్ కూడా తమతోనే ఉంటున్నాడని ఆమె చెప్పారు. చిన్నప్పటి నుంచి అందరూ ఎగతాళి చేయడం, తాను రెండో పెళ్లి చేసుకోవడం అతడికి మనుషులపై కోపం తెప్పించాయని, అందుకే అతను అందరినీ కొడుతూ తిరుగుతున్నాడని కపిల్ తల్లి వివరించారు.
కపిల్ మానసిక పరిస్థితిని పరీశిలంచిన వైద్యులు.. అతను ప్రస్తుతం ‘డోపమైన్ రష్’ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు. అతడికి చికిత్స చాలా అవసరమని చెప్పారు. అతడిని మరికొన్ని రోజులు అలాగే వదిలేస్తే తీవ్ర డిప్రెషన్కు గురై.. ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దాంతో పోలీసులు తగిన చికిత్స చేయంచాలని చెప్పి నిందితుడిని పేరెంట్స్కు అప్పగించారు.