Viral video : డీఎంకే (DMK) నేతలను, దొంగలను వేర్వేరుగా చూడలేమని తమిళనాడు (Tamil Nadu) బీజేపీ చీఫ్ కే అన్నామలై (Annamalai) అన్నారు. డీఎంకేకు చెందిన ఓ నాయకుడు ఒక కార్యక్రమంలో మహిళ చేతి నుంచి గాజును దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ చీఫ్ అన్నామలై ఆ వీడియోను షేర్ చేస్తూ డీఎంకేపై విమర్శలు గుప్పించారు. డీఎంకే నేతలను, దొంగలను వేర్వేరుగా చూడలేమని ఎద్దేవా చేశారు.
హిందీ భాషపై గత కొన్ని రోజులుగా కేంద్ర సర్కారుకు, తమిళనాడులోని డీఎంకే సర్కారుకు మధ్య వివాదం నడుస్తోంది. పాఠశాలల్లో హిందీని బోధించకపోతే నిధుల్లో కోత పడుతుందని కేంద్రం హెచ్చరిస్తుండగా.. తమపై బలవంతంగా హిందీని రుద్దవద్దని డీఎంకే ఎదురు తిరిగింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ డీఎంకే నేతలు హిందీ భాషకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
తాజాగా కూనూరు మున్సిపాలిటీలో కూడా డీఎంకే నేతలు హిందీ భాషకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఓ నాయకుడు తన పక్కన నిలబడి ప్రతిజ్ఞ చేస్తున్న మహిళ బంగారు గాజును దొంగిలించే ప్రయత్నం చేశాడు. దాంతో ఆ మహిళ తన చేతిని వెనక్కి లాక్కోవడం, పక్కనున్న మరో మహిళ సదరు నాయకుడి చేతిని నెట్టివేయడం కనిపించింది. అయితే వీడియోను చూస్తుంటే అది చిలిపి దొంగతనంలా కనిపిస్తోంది.
తీరా ప్రతిజ్ఞ సమయంలోనే సదరు నాయకుడు మహిళతో చిలిపిగా ప్రవర్తించడం పలు విమర్శలకు తావిచ్చింది. అతడి తీరుపై సొంతపార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆ వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ తనదైన స్టయిల్లో మండిపడ్డారు. కింద వీడియోలో సదరు నాయకుడి చిలిపి చేష్టలను మీరు కూడా చూడవచ్చు.
இந்தி எதிர்ப்புப் போர்வையில், வளையலைத் திருடும் குன்னூர் நகர்மன்ற 25-வது வார்டு திமுக கவுன்சிலர் திரு ஜாகிர் உசேன்.
திருட்டையும் திமுகவையும் எப்போதும் பிரிக்கவே முடியாது! pic.twitter.com/1wQKadFcnY
— K.Annamalai (@annamalai_k) March 4, 2025