Viral news : మహారాష్ట్రలోని పుణె సిటీలోగల సోమవార్ పేట్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నానబెట్టిన శనగలు తినడానికి నిరాకరించిన భర్తపై భార్య విచక్షణారహితంగా దాడి చేసింది. బండబూతులు తిడుతూ కర్రతో కొట్టింది. మిక్సీ జార్తో తలపై బాధింది. అతడి చేతి వేలిని కొరికేసింది. ముఖంపై గోళ్లలో గీరింది. ఎడమ చెవి వెనుక భాగంలో రక్తం వచ్చేలా రక్కింది. దాంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళ్తే.. సోమవార్ పేట్లోని త్రిశుండ గణపతి ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో 44 ఏళ్ల భర్త, 40 ఏళ్ల భార్య ఉంటున్నారు. ఈ నెల 1న రాత్రి నానబెట్టిన శనగల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నానబెట్టిన శనగలు తినాలని భార్య ఇవ్వగా.. భర్త అందుకు నిరాకరించాడు. తనకు ఇష్టం లేదని చెప్పాడు. దాంతో ఆగ్రహించిన భార్య అతడితో గొడవపడింది. బూతులు తిట్టింది.
భర్త ఎదురుతిరగడంతో సుత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. భర్త ఆ సుత్తిని గుంజుకోవడంతో మిక్సీ జార్తో తలపై బాధింది. ఆమె దాడి నుంచి తప్పించుకునేందుకు తలకు చేతులు అడ్డం పెట్టుకోవడంతో వేలు కొరికేసింది. ఆపై కర్రతో విచక్షణారహితంగా కొట్టింది. ఎలాగోలా భార్య బారి నుంచి తప్పించుకున్న భర్త స్థానిక పోలీసులను ఆశ్రయించాడు.
జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణకు వస్తాం ఇంటికి వెళ్లమని చెప్పగా.. అప్పటికే భయంతో వణికిపోతున్న బాధితుడు నిరాకరించాడు. రాత్రికి తనకు పోలీస్స్టేషన్లోనే ఆశ్రయం కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. తన భార్య మిక్సీతో తలపై రెండు సార్లు కొట్టిందని, తన చిటికెన వేలును కొరికేసిందని, కర్రతో కొట్టిందని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధిత భర్త పేర్కొన్నాడు.