Viral news : పెళ్లిపీటలపై వధువు (Bride) కు బదులుగా ఆమె తల్లి కూర్చోవడంతో ఆ వరుడు (Groom) బిత్తరపోయాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. అత్యాచారం కేసు పెడతామని బెదిరించినా భయపడలేదు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి కోసం తాను భారీగా ఖర్చు చేశానని, ఇప్పుడు మోసంవల్ల తన పెళ్లి ఆగిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం మీరట్ (Meerat) లోని బ్రహ్మపురి (Brahmapuri) లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మీరట్లోని బ్రహ్మపురికి చెందిన మొహమ్మద్ అజీం (22) కు శామలీ జిల్లావాసి మంతశా (21) తో పెళ్లి కుదిరింది. నిఖా సమయంలో ఆ నిఖా జరిపిస్తున్న మౌల్వీ వధువు పేరు ‘తాహిరా’ అని పలకడంతో వరుడికి అనుమానం వచ్చింది. ముసుగు తొలగించి చూడగా.. మంతశాకు బదులుగా భర్త చనిపోయిన ఆమె తల్లి (45) వధువు వేషధారణలో కూర్చుని ఉంది. దాంతో పెళ్లికొడుకు బిత్తరపోయాడు. మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశాడు. దాంతో వరుడి అన్నావదినలు అతడి నోరు మూయించేకు విఫలయత్నం చేశారు.
నోరు మూసుకుని పెళ్లి కూతురు తల్లిని పెళ్లిచేసుకోకపోతే అత్యాచారం కేసు పెడుతామని వరుడి అన్నా వదినలు బెదిరించారు. ఎందుకంటే ఈ పెళ్లికి వరుడి తరఫున పెద్దలుగా వ్యవహరించిన అతడి అన్నావదినలు అప్పటికే వధువు కుటుంబంతో కుమ్మక్కయ్యారు. అందుకే అల్లరి చేయకుండా పెళ్లి చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే రేప్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాంతో తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన అజీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి కోసం తాను రూ.5 లక్షలు ఖర్చు పెట్టానని ఫిర్యాదులో పేర్కొన్నాడు.