డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని చార్ ధామ్ పుణ్య క్షేత్రాల్లో వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం తెలిపారు. ఒకపై ప్రతి ఏటా దీనిని కొనసాగిస్తామని చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ‘చార్ ధామ్స్ వద్ద వీఐపీ దర్శన విధానాన్ని మేం రద్దు చేస్తున్నాం. ఇకపై చార్ ధామ్ వద్ద దర్శనం కోసం ప్రత్యేక కేటగిరీలు లేదా వీఐపీ వ్యవస్థ ఉండదు. దీనిని అందరికీ ఒకే విధంగా చేశాం’ అని మీడియాతో అన్నారు. చార్ ధామ్ పుణ్యక్షేత్రాల వద్ద కొంత మంది వీఐపీ యాత్రికులు పొడవైన క్యూల నుంచి దాటి వెళ్లే విధానానికి ముగింపు పలికినట్లు చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిబంధనల ప్రకారం చార్ ధామ్ యాత్రను క్రమపద్ధతిలో నిర్వహించాలని పోలీసులు, పరిపాలన అధికారులను ఆదేశించినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.
కాగా, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. పుష్కర్ సింగ్ ధామి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికి దేవుడు సమానమేనని తెలిపారు. దైవ దర్శనం కోసం ఎవరినీ ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.