అయోధ్య, ఆగస్టు 22: అయోధ్య ఆలయ విరాళాలకు సంబంధించి పలు ఆరోపణలు బయటపడిన క్రమంలో ఆలయంలో జరుగుతున్న మరిన్ని అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. అయోధ్య రాముడి దర్శనానికి గంటల తరబడి లైన్లలో వేచి ఉండక్కర్లేదు. మీరు అక్కడ ఉన్న బ్రోకర్లకు లంచం ఇస్తే చాలు. వారే మేజిస్ట్రేట్ కార్యాలయం నుంచి ప్రొటోకాల్స్ జారీ చేస్తారు. స్వయంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీ వెంట వచ్చి ఆలయ దర్శనం చేయిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శుభమ్ దూబే అనే ప్రచారకుడు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ మాకు రూ.7,300 ఇస్తే మీకు దగ్గరుండి వీఐపీ దర్శనం చేయిస్తాం’ అని ఆతడు పేర్కొన్నాడు.
అయోధ్య విరాళాల చోరీ, ఆలయంలోని అక్రమాలు బయటపడి సంచలనం సృష్టించినా.. ఈ దొడ్డిదారి దర్శనం మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆలయ అధికారులు, మహంతులు, పూజారులు భాగస్వాములేనని ఆయన తెలిపాడు. ఆలయ రద్దీ కారణంగా ఎంట్రీ పాస్ల జారీ నిలిపివేసినా బ్రోకర్లు వీటిని యథేచ్ఛగా భక్తులకు అమ్ముతుండటం కన్పించింది. అంతేకాకుండా సొమ్ములిస్తే ఆలయంలోని నిషేధిత ప్రాంతాల్లో యథేచ్ఛగా రీల్స్ చేసుకోవచ్చు. కెమెరాతో షూటింగ్లు చేసుకోవచ్చు.
అయోధ్య విరాళాల చోరీ కేసులో ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా, ఆలయ అధికారి గోపాల్ రావులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, లేకపోతే తదుపరి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కాగా, అయోధ్యలో తొమ్మిది పేజీల లేఖ ఒకటి సంచలనం సృష్టించింది.ఆలయ కమిటీ చైర్మన్ నృశేంద్ర మిశ్రాయే అయోధ్య నిర్మాణ వ్యవహారాలన్నీ చక్కెబెట్టారని, అన్నింటికీ కర్త, కర్మ, క్రియ అయనేనని,ఆప్తులను కమిటీలో చేర్చారని ఆందులో ఆరోపించారు.