సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామాపై సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించారు. దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు తన సోదరుడితో సమానమని చెప్పారు. విక్రమాదిత్య సింగ్ రాజీనామాను ఆమోదించే ప్రశ్నే లేదని అన్నారు. ఆయన బాధలన్నీ పరిష్కరిస్తానని తెలిపారు. (Himachal Pradesh crisis) కొంత మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని సీఎం సుఖ్విందర్ సింగ్ ఆరోపించారు. అయితే బీజేపీ ప్రయత్నం విఫలమైందని అన్నారు. అలాగే తాను రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
కాగా, మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేశారు. విక్రమాదిత్య సింగ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
మరోవైపు హర్యానాలోని ఓ హోటల్లో బస చేసిన రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బడ్జెట్ సెషన్లో పాల్గొనేందుకు బుధవారం సిమ్లాకు తిరిగి వచ్చారు. అసెంబ్లీ సమావేశంలో గందరగోళం సృష్టించిన 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం ఆ రాష్ట్ర బడ్జెట్కు సభ ఆమోదం తెలిపింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యల అంశాన్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నది.