చెన్నై, మే 4: తమిళనాడులో అధికార పీఠం ఎక్కడానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉన్న విజయ్కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ రాజకీయంగా మరో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. పార్టీ స్థాపించిన రెండేండ్లకే ఏ పార్టీ అయినా అధికారం దక్కించుకోవడం అంత సులభం కాదు. దీంతో చరిత్రలో ఆ ఫీట్ సాధించిన రెండో వ్యక్తిగా విజయ్ నిలవనున్నారు. తమిళనాడులో విజయ్ విజయం చూస్తుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దిగ్గజ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తప్పక గుర్తుకు వస్తారు.
ఆయన కూడా తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసి, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి ఏపీలో అధికారంలోకి వచ్చారు. వీరిద్దరికీ కూడా పలు పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారే. ఇద్దరూ కూడా పార్టీ స్థాపించిన కొద్ది కాలానికే అధికారానికి చేరువయ్యారు. తమిళనాడులో తొలుత దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎంజీ రామచంద్రన్ వీరిద్దరికీ రాజకీయాల్లో ఆదర్శంగా పేర్కొనవచ్చు.
రెండేండ్ల క్రితం తన టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ ఎన్టీఆర్ మార్గంలోనే పయనించారు. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి, నటుడిగా ఉన్న తనపై అభిమానాన్ని రాజకీయ అభిమానంగా మార్చుకుని అతి పెద్ద పార్టీగా ఘన విజయం సాధించారు. సినీనటులు రాజకీయ పార్టీలు పెట్టి అధికారంలో భాగస్వాములు కావడం దక్షిణాదిలో కొత్తేమీ కాదు. గతంలో పలువురు నటులు రాజకీయ ప్రవేశం చేసినా దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగలేక పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నటుడు చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల్లో 18 సీట్లు మాత్రమే నెగ్గారు.
తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి 2011లో తన పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. అతని సోదరుడు పవన్ కల్యాణ్ 2014లో ఏపీలో జనసేన పార్టీని స్థాపించారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. 2024లో ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించి 100 శాతం విజయాన్ని సాధించింది. తమిళనాడులో వెటరన్ నటుడు కమల్హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని 2018లో స్థాపించారు. 2021 కోయంబత్తూర్ సౌత్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తర్వాత డీఎంకేతో పొత్తుపెట్టుకుని రాజ్యసభ ఎంపీ అయ్యారు.