లక్నో: ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ దవాఖానల పరిస్థితికి అద్దం పట్టే ఘటన ఇది. రక్తం ధారలు కట్టినా, అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని దవాఖాన సిబ్బంది పట్టించుకొన్న పాపాన పోలేదు. ఓ కుక్క వచ్చి ఆ రక్తాన్నంతా నాకింది. ఈ దారుణ ఘటన ఖుషీనగర్ జిల్లా దవాఖానలో చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళితే.. బిట్టు(24) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురవటంతో అంబులెన్స్లో దవాఖానకు తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడికి చికిత్స అందించేందుకు ఏ ఒక్కరూ అందుబాటులో లేరు. బెడ్పై ఉంచితే నేలపై పడిపోయాడు. రక్తం ఏరులై పారింది. అయినా ఎవరూ రాలేదు. అక్కడే ఉన్న ఒక కుక్క నేలపై ఉన్న రక్తాన్ని నాకింది. ఈ వీడియో వైరల్ కావటంతో నలుగురు వార్డు బాయ్స్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.