న్యూఢిల్లీ: ఇటీవల తమిళనాడులో జరిగిన హెలిక్యాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ దంపతులతోపాటు ప్రాణాలు కోల్పోయిన బ్రిగేడియర్ లఖ్విందర్సింగ్ లిద్దర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఉదయం లిద్దర్ భార్య గీతికా లిద్దర్, కుమార్తె ఆస్నా లిద్దర్ అశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో భావోద్వేగాలు, గుండెలను మెలిపెట్టే దృశ్యాల నడుమ బ్రిగేడియర్ లిద్దర్కు అంతిమ సంస్కారాలు చేశారు.
లిద్దర్ చితికి నిప్పంటించడానికి కొన్ని నిమిషాల ముందు కనిపించిన దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. జాతీయ పతాకాన్ని పరిచి, పూలతో అలంకరించి ఉన్న లిద్దర్ శవపేటిక దగ్గరకు ఆయన భార్య గీతికా లిద్దర్, కుమార్తె ఆస్నా లిద్దర్ చేరుకున్నారు. గీతికా లిద్దర్ తన భర్త తలవైపున మోకాళ్లపై కూర్చుని శవపేటికపై ముద్దుపెట్టింది. అదే సమయంలో కుమార్తె ఆస్నా లిద్దర్ తన తండ్రి శవపేటికపై దోసిలితో రోజా పూలను విడుస్తూ వెక్కివెక్కి ఏడ్చింది. ఈ రెండు దృశ్యాలను చూసిన స్థానికులు దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు.