న్యూఢిల్లీ, డిసెంబర్ 7: పార్లమెంట్ ఆమోదించిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యాక్ట్-2014 (ఎన్జేఏసీ)ను సుప్రీంకోర్టు రద్దు చేయటం అంటే ప్రజానిర్ణయాన్ని తిరస్కరించటమేనని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ అన్నారు. పార్లమెంటరీ సార్వభౌమత్వం రాజీపడినట్టేనని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజ్యసభ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఎన్జేఏసీ రద్దుపై మరోసారి తన స్వరాన్ని వినిపించారు.
పార్లమెంట్ అనేది ప్రజా శాసనాలను సంరక్షించేదని, ఈ సమస్యపై దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. పార్లమెంట్ ఆ దిశగా చర్యలు చేపడుతుందని నమ్ముతున్నానని చెప్పారు. కాగా, గత వారం సింఘ్వీ స్మారకోపన్యాసం సందర్భంగా మాట్లాడిన ధన్కర్.. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సమక్షంలోనే ఎన్జేఏసీ రద్దును ప్రశ్నించారు. చట్టాలను రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని అన్నారు. ఇలాంటి ఘటనలను ప్రపంచం ఎన్నడూ చూడలేదని వెల్లడించారు.
‘2015-16లో పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. దాన్ని లోక్సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించాయి. విస్తృత ప్రజాభిప్రాయానికి ప్రతీక అయిన ఆ చట్టం రాజ్యాంగ నిబంధన అయ్యింది. కానీ, దాన్ని న్యాయస్థానం కొట్టేసింది. మనలాంటి చైతన్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో విస్తృత ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే చట్టాలు చేయకుంటే ఎలా? ఇంకా ఆలస్యం కాలేదు. దీని గురించి అందరూ ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.
లోక్సభ ముందుకు సహకార బిల్లు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో బుధవారం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ రంగంలో పారదర్శకత, జవాబుదారీ విధానాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. బిల్లుపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ బిల్లు రాష్ర్టాల హక్కులను కాలరాసేలా ఉన్నదని విమర్శించాయి. కోఆపరేటివ్ అనేది రాష్ర్టానికి సంబంధించిన అంశమని, దీనిలో కేంద్రం జోక్యం సరికాదని మండిపడ్డాయి.
పలు అంశాలు లేవనెత్తిన ఎంపీలు
లోక్సభలో ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కోరారు. కాంగ్రెస్, టీఎంసీకి పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్ పదవులు ఇవ్వకపోవటంపై ఆ పార్టీ నేతలు కేంద్రాన్ని నిలదీశారు. విపక్ష పార్టీల నుంచి పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్ను ఎంపిక చేయటానికి కేంద్రం సుముఖంగా లేదని లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ఏ కమిటీకి కూడా చైర్మన్ పదవి కట్టబెట్టకపోవటాన్ని టీఎంసీ ఎంపీ బందోపాధ్యాయ్ ప్రశ్నించారు.