న్యూఢిల్లీ, జూలై 19: విపక్షాల తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ నేతలు రాహుల్గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రౌత్, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్, డీఎంకే నేత తిరుచ్చి శివ, సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా తదితరులు ఉన్నారు. కాగా, ఆమె వెంట టీఎంసీ, ఆప్ నేతలు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. నామినేషన్ అనంతరం మార్గరెట్ మాట్లాడుతూ.. ఎన్నికలకు తాను భయపడబోనని, గెలుపు, ఓటమి అనేది జీవితంలో ఓ భాగమని పేర్కొన్నారు. ప్రజలను దగ్గరకు చేర్చేందుకు ఇరుసభల సభ్యుల నమ్మకం దోహదపడుతుందని చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆగస్టు 6న జరుగనున్నాయి. ఎన్డీయే తరఫు అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ ఇప్పటికే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.