న్యూఢిల్లీ : వీహెచ్పీ నేత సాధ్వి సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ గోవులను కాపాడుకునేందుకు కత్తులు చేబూనాలని ఆమె కోరారు. వీహెచ్పీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సాధ్వి సరస్వతి మాట్లాడుతూ ఫోన్లపై లక్షలు వెచ్చించే బదులు ప్రజలు తమ గోవులను రక్షించుకునేందుకు కత్తులు, ఆయుధాలను కొనుగోలు చేయాలని పిలుపు ఇచ్చారు.
ప్రజలు రూ లక్షల విలువ చేసే ఫోన్లను కొనుగోలు చేసే స్ధోమత ఉంటే కచ్చితంగా వారు గోవులను కాపాడుకోవడం కోసం ఆయుధాలను కొని ఇంట్లో ఉంచుకోవాలని పిలుపు ఇచ్చారు. ఇలా చేస్తే గో వధ బారి నుంచి ప్రజలు తమ గోవులను భద్రంగా ఉంచుకోవచ్చని చెప్పారు.
ఉడిపి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గోశాలలో పుట్టిన తాను గోవధను అడ్డుకోవడం బాధ్యతగా ముందుకెళతానని పేర్కొన్నారు. దేశంలో గోవధను అరికట్టడం, రామ మందిర నిర్మాణం జరగడం అనే రెండు తీర్మానాలను తాను చిన్నతనంలోనే తీసుకున్నానని సాధ్వి సరస్వతి స్పష్టం చేశారు.