న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం చాలా దురదృష్టకరమని వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ అన్నారు. రైతులు గత 40 ఏండ్లుగా సంస్కరణలు కోరుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం మంచిది కాదన్నారు. సంస్కరణలకు ప్రస్తుత వ్యవసాయ వ్యవస్థ సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు.
మునుపటి ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం లేనందున, వ్యవసాయ రంగాన్ని సంస్కరించాలనే సంకల్పం ఈ ప్రభుత్వానికి ఉందని తాను భావిస్తున్నానని అనిల్ ఘన్వత్ తెలిపారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష నాయకులు, రైతు నాయకులతో కూడిన మరో కమిటీని ఏర్పాటు చేస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
కనీస మద్దతు ధర (MSP)కి తాము వ్యతిరేకం కాదని అనిల్ తెలిపారు. అయితే ఓపెన్-ఎండ్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సమస్య ఉందన్నారు. బఫర్ స్టాక్ కోసం 41 లక్షల టన్నుల ధాన్యం అవసరమైతే, 110 లక్షల టన్నులు సేకరించారని విమర్శించారు. MSP చట్టం చేస్తే, రైతులంతా తమ పంటలపై MSPని డిమాండ్ చేస్తారని అన్నారు. అయితే దాని వల్ల ఎవరూ ఏమీ సంపాదించే స్థితిలో ఉండరని వ్యాఖ్యానించారు.