న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజైన సోమవారం రాజ్యసభలో 12 మంది విపక్ష పార్టీల సభ్యులను సస్పెండ్ చేయడంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం విపక్ష పార్టీలకు చెందిన 8 మంది రాజ్యసభ సభ్యులు.. కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో ఛైర్మన్ వెంకయ్యనాయుడును ( Venkaiah Naidu ) కలిశారు.
విపక్ష పార్టీలకు చెందిన 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసే విషయమై పునరాలోచన చేయాలని వెంకయ్యనాయుడును కోరారు. అయితే, సస్పెండ్ అయిన సభ్యులు క్షమాపణలు చెప్పకుండా వారిపై సస్పెన్షన్ ఎత్తివేయడం సాధ్యం కాదని వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. ఇదిలావుంటే తాము ఏ తప్పు చేయలేదని, సభలో క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని సస్పెండైన ఎంపీలు తెగేసి చెబుతున్నారు.