ముంబై, డిసెంబర్ 11: నిర్భయ ఫండ్ కింద మహారాష్ట్రలోని ముంబై పోలీసులు కొనుగోలు చేసిన వాహనాలు దుర్వినియోగం అవుతున్నాయి. మహిళ రక్షణ కోసం, వారిపై నేరాలను అరికట్టేందుకు వినియోగించాల్సిన వాహనాలు.. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ బండ్లుగా మారాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 30కి పైగా బొలెరో వాహనాలను వారికి వై ప్లస్ భద్రత ఇచ్చేందుకు వినియోగిస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. దీని వల్ల నగరంలోని పోలీసుస్టేషన్ల పరిధిలో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్కు సరిపడా వాహనాలు ఉండట్లేదు. మహిళల రక్షణ కంటే అధికార ఎంపీ, ఎమ్మెల్యేల భద్రత, ఎస్కార్ట్ ముఖ్యమా? అని ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ ప్రశ్నించాయి.