భువనేశ్వర్: ఆ కూరగాయల దుకాణంలో అన్ని రకాల వెజెటబుల్స్తోపాటు డ్రగ్స్ కూడా లభిస్తాయి. అరే.. ఆ షాపు ఎక్కడుంది అనుకుంటున్నారా.. ఒడిశాలోని గంజామ్ జిల్లాలోని భలియాగడలో ఉంది. భాస్కర్ దొర ఆ దుకాణ యజమాని. కూరగాయ అమ్ముతూనే సైడ్ బిజినెస్ అన్నట్లు.. డ్రగ్స్ కూడా రిటైల్ దందా కూడా చేస్తున్నాడు ఈ దొర.
అయితే అక్రమ వ్యాపారం ఎన్నోరోజులు సాగదుగా..! ఎప్పటిలానే విషయం పోలీసుల చెవిన పడింది. పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దొరగారి షాపుపై దాడులు చేసి పెద్ద మొత్తంలో గంజాయి, మత్తు పదార్థాలను దొరకబట్టారు. 101 గ్రాముల బ్రౌన్షుగర్, వంద గ్రాముల ఓపియం, భారీమొత్తంలో గంజాయి లభించిందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏకే సత్పతి వెల్లడించారు. డ్రగ్ పెడ్లర్ల నుంచి మత్తు పదార్థాలను కొని.. కూరగాలయల మాటున వాటిని కూడా అమ్ముతున్నాడని చెప్పారు. అతనికి ఎక్కడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడనే విషయం దర్యాప్తులో తేలుస్తుందన్నారు.