జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot )ను బీజేపీ నాయకురాలు వసుంధర రాజే (Vasundhara Raje) ప్రత్యేకంగా కలిశారు. జైపూర్లో కొత్తగా నిర్మించిన రాజస్థాన్ కాన్స్టిట్యూషన్ క్లబ్ను శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ సీఎం, బీజేపీ కీలక నాయకురాలు వసుంధర రాజే, సీఎం అశోక్ గెహ్లాట్తో కలిసి వేదిక పంచుకోలేదు. అయితే ఆ కార్యక్రమం తర్వాత అశోక్ గెహ్లాట్ను ప్రత్యేకంగా ఆమె కలిశారు. రాజస్థాన్ రాజకీయాల్లో ఇది కలకలం రేపింది.
కాగా, బీజేపీ తనను పట్టించుకోవడం లేదని వసుంధర రాజే సొంత పార్టీపై గుర్రుగా ఉన్నారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వసుంధర రాజే సొంత ప్రాంతంలో శుక్రవారం కొనసాగిన బీజేపీ పరివర్తన్ యాత్రలో కూడా పాల్గొనలేదు. దీంతో ఆమె గైర్హాజరుకావడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు అదే రోజు కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ను వసుంధర రాజే ప్రత్యేకంగా కలిశారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే వసుంధర రాజే కార్యాలయం దీనిపై స్పందించింది. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ సీపీ జోషి, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ కూడా వారితోపాటు ఉన్న పూర్తి ఫొటోను ఎక్స్లో షేర్ చేసింది. అయితే సీఎం అశోక్ గెహ్లాట్ను ప్రత్యేకంగా
కలవడంపై వస్తున్న అనుమానాలపై వసుంధర రాజే కార్యాలయం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
— Office Of Vasundhara Raje (@OfficeVRaje) September 22, 2023