Varun Gandhi : కరోనా వైరస్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూపీలో భారీ ర్యాలీలు, ప్రచార సభలను నిర్వహించడం పట్ల సొంత పార్టీపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు గుప్పించారు. రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తూ పగలు లక్షలాది మందితో ర్యాలీలు నిర్వహించడం ఏంటో సామాన్యుడి ఊహకు అందడం లేదని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
యూపీలో పరిమిత వైద్యారోగ్య వసతులను దృష్టిలో ఉంచుకుని ఒమిక్రాన్ కట్టడికి ప్రాధాన్యత ఇవ్వాలా లేక ఎన్నికల ముందు బలప్రదర్శనకు పూనుకోవాలా అన్నది మనం నిర్ణయించుకోవాలని వరుణ్ గాంధీ ట్విట్టర్ వేదికగా కాషాయ పార్టీకి చురకలు వేశారు. డిసెంబర్ 25న యూపీ సీఎం ఘజియాబాద్లో జన్ విశ్వాస్ యాత్ర ర్యాలీలో పాల్గొనడంతో పాటు ప్రధాని మోదీతో కలిసి ఇటీవల పలు ర్యాలీల్లో పాల్గొన్నారు.
మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని ఈనెల 23న అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ నేతలు ఓవైపు వైరస్ నియంత్రణకు అప్రమత్తంగా ఉండాలని పిలుపు ఇస్తూనే భారీ ర్యాలీలు ఏర్పాటు చేయడం పట్ల వరుణ్ గాంధీ తన అసంతృప్తిని ట్విటర్ వేదికగా వెలిబుచ్చారని చెబుతున్నారు. బీజేపీతో పాటు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లు కూడా యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో భారీ ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి.