Vande Bharat Express : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన హై స్పీడ్ వందే భారత్ రైళ్లు ఈ మధ్య తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా మరొక రైలు మధ్యలోనే ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబీ జిల్లాలోని భర్వాలీ రైల్వేస్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్(నంబర్ 2246) శుక్రవారం అకస్మాత్తుగా నిలిచిపోయింది. చక్రాల దగ్గర వింత శద్దం రావడం గమనించిన లోకో పైలెట్ అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశాడు. ఏం జరిగి ఉంటుందని సిబ్బంది పరిశీలించగా… చక్రాల మధ్య ఒక లోహపు వస్తువు ఇరుక్కుపోవడం గమనించారు. దానివల్లనే రైలు ధ్వని వేరేలా వచ్చిందని సిబ్బంది వెల్లడించారు. ఆ లోహపు వస్తువును తొలగించి, రైలును నడిపి చూశారు. ఎలాంటి శబ్దం రాకపోవడంతో మళ్లీ యథావిధిగా లోకో పైలెట్ రైలును కదిలించాడు.
‘రైలు వేగంగా ప్రయాణిస్తుండగా మొదటి కోచ్ నుంచి వింత శబ్దాలు రావడం లోకోపైలెట్ గమనించాడు. అనుమానంతో వెంటనై రైలును భర్వాలీ స్టేషన్లో ఆపాడు. దాంతో ప్రమాదం తప్పింది’ అని పీఆర్ హెచ్సీ ఉపాధ్యాయ్ వెల్లడించాడు. హై స్పీడ్ రైళ్లు అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్లను తీసుకొచ్చిన నెలల రోజుల్లోనే నాలుగు ప్రమాదాలు జరిగాయి. అక్టోబర్ నెలలో గుజరాత్లోని అతుల్ స్టేషన్ సమీపంలో ఆవుల మీదకు వందే భారత్ ఎక్స్ప్రెస్ దూసుకెళ్లింది.