హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయడంలో అడుగడుగునా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ‘వందేభారత్’ రైళ్లను ప్రారంభించడంలో కూడా తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్నది. దేశవ్యాప్తంగా 75 ‘వందేభారత్’ రైళ్లను ప్రారంభిస్తామని ఢాంబికాలు పలికిన నరేంద్రమోదీ సర్కారు.. అందులోనూ రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నది. ఎన్నికలు జరుగుతున్న రాష్ర్టాల్లో మాత్రమే ‘వందేభారత్’ రైళ్లను ప్రారంభిస్తున్నది.
2019 ఆగస్టులో యూపీలోని వారణాసి నుంచి న్యూఢిల్లీకి తొలి ‘వందేభారత్’ రైలును ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత 2020లో జమ్ముకశ్మీర్లోని కాట్రా-న్యూఢిల్లీ మధ్య, ఈ ఏడాది సెప్టెంబర్లో మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోని అహ్మదాబాద్-ముంబై మధ్య, ఈ నెల 13న హిమాచల్ప్రదేశ్-న్యూఢిల్లీ మధ్య ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. వచ్చే నెల 10న చెన్నై-బెంగళూరు మధ్య ‘వందేభారత్’ రైలును ప్రారంభించాలని నిర్ణయించింది. కానీ, తెలంగాణలో రైల్వేలకు అత్యధిక లాభాలు వస్తున్నప్పటికీ ‘వందేభారత్’ రైలు ప్రారంభించేందుకు చేతులు రావడం లేదని కేంద్రంపై రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
ట్రాకులు, సిగ్నళ్లు సరిగా లేవట
తెలంగాణలో ‘వందేభారత్’ రైళ్లను ప్రారంభించాలన్న ప్రతిపాదనలు చాలా కాలం నుంచే ఉన్నప్పటికీ అందుకు రాష్ట్రంలోని రైల్వే ట్రాకుల సామర్థ్యం సరిపోదని, సిగ్నలింగ్ వ్యవస్థ పటిష్ఠంగా లేదని సాకులు చెప్తూ కేంద్రం కొట్టిపారేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇంతకీ తెలంగాణలో ‘వందేభారత్’ రైళ్లను ప్రారంభిస్తారా? లేదా?, ఒకవేళ ప్రారంభిస్తే ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి? అన్నదానిపై దక్షిణ మధ్య రైల్వే అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేదు. ఈ రైళ్ల వేగానికి అనుగుణంగా ట్రాకుల సామర్థాన్ని పెంచుకోవాలని తమకు ఆదేశాలు కూడా రాలేదని వారు చెప్తున్నారు.
ఆధునిక అవసరాలకు అనుగుణంగా..
గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ‘వందేభారత్’ రైళ్లను దేశీయ పరిజ్ఞానంతో ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. అన్నీ ఏసీ కోచ్లు మాత్రమే ఉండే ఈ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అనేక వసతులు కల్పిస్తున్నారు. నాణ్యమైన క్యాటరింగ్, ప్రయాణికులకు ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు బయోటాయిలెట్లు, స్పోక్ అలారం, ఆటోమ్యాటిక్ డోర్ లాకింగ్, పెద్ద కిటికీలు, రొటేటింగ్ వీల్చైర్లు, బ్యాగేజీకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.