న్యూఢిల్లీ: ఏప్రిల్ 15 నుంచి యూఎస్ఎస్డీ ఆధారిత కాల్ ఫార్వర్డింగ్ సేవలను నిలిపివేయాలని టెలికాం ఆపరేటర్లను టెలికమ్యూనికేషన్స్ విభాగం ఆదేశించింది. ప్రత్యామ్నాయ మార్గా న్ని ఆన్వేషించాలని సూచించింది. ప్రస్తుతం *401# డయల్ చేయడం ద్వారా సులువుగా కాల్ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంది. దీనినే యూఎస్ఎస్డీ ఆధారిత కాల్ ఫార్వర్డింగ్ అంటారు. ఈ సదుపాయం దుర్వినియోగం అవుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. కొందరు మోసగాళ్లు.. కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామని ఫోన్ చేసి, ‘మీ సిమ్లో సమస్య ఉంది. ఒకసారి *401# డయల్ చేయండి’ అని అడుగుతున్నారు. ఇలా డయల్ చేసిన వారి కాల్స్ను, మెసేజ్లను తమకు ఫార్వర్డ్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.