న్యూఢిల్లీ: అసలే వ్యాక్సిన్ల కొరతతో అల్లాడుతున్న రాష్ట్రాలు, ప్రజలకు మరో బ్యాడ్న్యూస్ చెప్పారు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా. వ్యాక్సిన్ల కొరత జులై వరకూ తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఈ కొరతకు బాధ్యత తమ కంపెనీది కాదు ప్రభుత్వానిదే అని కూడా అదర్ మరో బాంబు పేల్చారు. జనవరిలో పరిస్థితి చూసి ఇక ఇండియాలో కరోనా పనైపోయిందని అందరూ అనుకున్నారు. సెకండ్ వేవ్ను అంచనా వేయడంలో అధికార యంత్రాంగం దారుణంగా విఫలమైంది. రాజకీయ నాయకులు, విమర్శకులు వ్యాక్సిన్ కొరతకు మా కంపెనీని బదనాం చేశారు. కానీ దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కంపెనీ అస్సలు కాదు అని అదర్ తేల్చి చెప్పారు.
నన్ను బలిపశువును చేయాలని చూశారు. గతంలో వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంచలేదు. తగిన ఆర్డర్లు లేవు కాబట్టి తయారీ పెంచలేదు. ఏడాదికి 100 కోట్ల డోసులు అవసరమవుతాయని మేము అనుకోలేదు అని పూనావాలా స్పష్టం చేశారు. ప్రస్తుతం పుణెలోని సీరంలో నెలకు 6-7 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు తయారువుతున్నాయి. దీనిని మరో నెల రోజుల్లో నెలకు 10 కోట్లకు పెంచనున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదర్ చెప్పారు.
వ్యాక్సిన్ కోసం తనకు బెదిరింపులు వస్తున్నాయని, అందుకే ఇండియా వదిలి లండన్ వచ్చేసినట్లు ఆయన చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఇండియా వస్తానని, వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తానని తెలిపారు. ప్రస్తుతం అయితే కొవిషీల్డ్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఉన్నట్లు చెప్పారు.