హైదరాబాద్ : దేశంలో త్వరలో పిల్లలకు టీకాలు వేయనున్నారు. హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాను 12-18 సంవత్సరాల పిల్లలకు వేసేందుకు అత్యవసర వినియోగం కింద డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కొవాగ్జిన్ టీకాను పంపిణీ చేస్తున్నారు.
ఇటీవల నిపుణుల కమిటీ సైతం టీకా వినియోగానికి డీసీజీఐకి సిఫారసు చేసింది. ఇప్పటికే అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిలా కంపెనీ తయారు చేసిన కొవిడ్ టీకా జైకోవ్ డీ వ్యాక్సిన్ 12 సంవత్సరాలు పైబడిన వారందరికీ వేసేందుకు డీసీజీఐ ఆగస్ట్లో అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కొవాగ్జిన్కు అనుమతి పిల్లలకు అందుబాటులోకి వచ్చిన రెండో టీకాగా నిలిచింది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పిల్లలకు టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాలేదు. కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తున్న నేపథ్యంలో టీకాల పంపిణీపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పిల్లలకు సైతం టీకాలు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నది. ఇప్పటికే జైడస్ క్యాడిలా వ్యాక్సిన్కు రెండు కోట్ల వ్యాక్సిన్కు ఆర్డర్ ఇవ్వగా.. పిల్లల వ్యాక్సిన్కు సంబంధించిన టీకాకు సైతం కేంద్రం ఆర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. రెండు టీకాలు అందుబాటులోకి రావడంతో జాతీయ టీకాల పంపిణీ కార్యక్రమంలో చేర్చి అతిత్వరలోనే టీకాలు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.