Asaduddin Owaisi : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న నేపథ్యంలో.. అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ (Majlis) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా, యూపీలో కీలకనేతగా గుర్తింపు పొందిన సయ్యద్ అసిమ్ వకార్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
దాదాపు దశాబ్ద కాలంగా ఎంఐఎంలో కొనసాగుతున్న వకార్.. పార్టీ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “బీజేపీని, దాని సిద్ధాంతాలను ఎదుర్కొంటామని ఎంఐఎం చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల వంటి లౌకిక శక్తులకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
“దేశంపై ప్రేమ ఉన్న ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుకుంటున్నారు. మనం నిజమైన దేశభక్తులమై ఉండి, బీజేపీని నిజాయతీగా అధికారం నుంచి తొలగించాలనుకుంటే, ఆ పార్టీతో రాజీలేని పోరాటం చేస్తున్న కాంగ్రెస్తో కలిసి నడవాలి” అని వకార్ స్పష్టం చేశారు.
వకార్ ఎంఐఎంలో చేరడానికి ముందు సుమారు 20 ఏళ్లపాటు సమాజ్వాదీ పార్టీలో పనిచేశారు. ఇదిలావుండగా 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 95 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.