లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. నిత్యం హత్యలు, అత్యాచారాలతో ఆ రాష్ట్రం వార్తల్లో నిలుస్తున్నది. పైగా కొన్ని కేసుల్లో అక్కడి పోలీసులు బాధితులను బెదిరిస్తూ నిందితులకే కొమ్ముకాస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఓ యువతి ఏకంగా అదనపు డీజీపీ ఆఫీస్లో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. భాగ్పట్ జిల్లాలోని సుంగర్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరు నెలల క్రితం 17 ఏండ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పుడే బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఎందుకు నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల బాధితురాలు ప్రశ్నించడంతో పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
పైగా అసలు నీపై అత్యాచారమే జరగలేదని, నువ్వు పెట్టింది తప్పుడు కేసు అని బాధితురాలిని దబాయించారు. దాంతో ఇవాళ ఆమె బరేలీలో అదనపు డీజీపీ కార్యాలయానికి తన అక్కతో కలిసి వెళ్లింది. అక్కడ ఏడీజీపీ పీసీ మీనా లేకపోవడంతో వెంట తీసుకెళ్లిన విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.