లక్నో: బీజేపీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ (89) అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు. లక్నోలోని సంజయ్ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు.ఆయన మరణ వార్త తెలియగానే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తన పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన లక్నోకు చేరుకున్నారు.
1932 జనవరి ఐదో తేదీన జన్మించిన కల్యాణ్ సింగ్ రెండు సార్లు ఉత్తరప్రదేశ్ సీఎంగా, రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారు. 1992 డిసెంబర్ ఆరో తేదీన అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో యూపీ సీఎంగా ఉన్నారు.
హిందూ జాతీయ వాదాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రముఖ నేతల్లో ఆయన ఒకరు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని సాగిన ఆందోళనకు సారధ్యం వహించిన నేతల్లో ఒకరు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఆరెస్సెస్ సభ్యత్వం పొందారు. 1967లో అట్రౌలి నుంచి యూపీ శాసనసభకు ఎన్నికయ్యారు. అదే స్థానం నుంచి భారతీయ జన్సంఘ్, జనతా పార్టీ, రాష్ట్రీయ క్రాంతి పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున తొమ్మిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1991లో తొలిసారి యూపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రెండో దఫా 1997లో సీఎంగా పని చేసిన కల్యాణ్ సింగ్.. 1999లో పార్టీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆ తర్వాత సొంతంగా పార్టీని స్థాపించారు. తిరిగి 2004లో బీజేపీలో చేరిన కల్యాణ్ సింగ్.. బులంద్ షహర్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. కానీ 2009లో రెండోసారి బీజేపీని వీడారు. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎటా నుంచి పార్లమెంట్కు ఎన్నికయ్యారు.
2014లో తిరిగి బీజేపీలో చేరిన కల్యాణ్ సింగ్ను తర్వాత రాజస్థాన్ గవర్నర్గా ప్రధాని నరేంద్రమోదీ నియమించారు. ఐదేండ్ల పాటు రాజస్థాన్ గవర్నర్గా పని చేసిన కల్యాణ్ సింగ్.. 2019లో తిరిగి క్రియా శీల రాజకీయాల్లో ప్రవేశించారు. అదే ఏడాది బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కేసుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణను ఎదుర్కొన్నారు. అయితే 2020లో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.
లోదీ సామాజిక వర్గానికి చెందిన కల్యాణ్ సింగ్.. బీజేపీకి ఉత్తరప్రదేశ్లో ఓబీసీల మద్దతు కూడగట్టడంలో కల్యాణ్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. సంప్రదాయంగా అగ్ర కులాల మద్దతు గల బీజేపీకి బీసీల మద్దతు సంపాదించారు.